వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి ఐదో తేదీన నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఎన్నికల ప్రచారం కోసం నాగాలాండ్లో పర్యటించనున్నారు. ఈనెల 23వ తేదీన దిమాపూర్లో జరిగే బహిరంగ ర్యాలీలో సోనియా గాంధీ, మార్చి ఒకటో తేదీన జరిగే ర్యాలీలో ప్రధాని సింగ్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపాయి. ఇదిలావుండగా జాతీయ భద్రతా కమిటీ సలహాదారు ఎంకే.నారాయణన్ ఈ రాష్ట్రంలో ప్రర్యటిస్తున్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన నాగాలాండ్ గవర్నర్ కె.శంకరనారాయణన్తో భేటీ అయ్యారు. అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో పాటు ఆర్మీ అధికారులులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
|