లోక్సభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెరదించారు. తమ పార్టీకి గానీ, యూపీఏ ప్రభుత్వానికి గానీ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలనే తపన లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశం మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. ఇందులో సోనియా గాంధీ కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుత పార్లమెంట్కు మరో ఏడాది గడువు ఉందని, అందువల్ల ఇప్పటి నుంచే లోక్సభ ఎన్నికలకు సమాయాత్తం కావాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అలాగే.. త్వరలో జరుగనున్న ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా తగిన ప్రణాళికలతో సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో సాధించిన విజయాలు అద్భుతమని, అందువల్ల వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని సోనియా వ్యక్తం చేశారు. ఇకపోతే ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బాగుందని కొనియాడిన సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరంలపై ప్రశంసల జల్లు కురిపించారు.
ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష పార్టీ భాజపా చేసిన అసత్య ఆరోపణలను ప్రధాని మన్మోహన్ సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో వాస్తవాలను ప్రతిబింభించే విధంగా ప్రధాని ప్రసంగం సాగిందని సోనియా కితాబిచ్చారు. నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు.. ముగిసిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయని అందువల్ల వీటి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలని సోనియా విజ్ఞప్తి చేశారు.
|