కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన అమెరికా పర్యటనలో భాగంగా.. సోమవారం ఆ దేశ అధ్యక్షుడు జార్జి బుష్తో భేటీకానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆదివారం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ తొలుత స్టేట్ కార్యదర్శి కండోలినా రైస్తో సోమవారం ఉదయం సమావేశమవుతారు. వీరిద్దరి మధ్య ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై కీలక చర్చలు జరిగే అవకాశముంది.
ఆ తర్వాత వైట్హౌస్కు చేరుకునే ప్రణబ్ యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుడు స్టీఫెన్ హెడ్లీ, ఆ తర్వాత జార్జి బుష్తో సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకునే ప్రణబ్ మంగళవారం తిరుగు పయనమవుతారు. ప్రణబ్ తన పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చించనున్నారు. అతి ముఖ్యమైన అణు ఒప్పందంపై ప్రణబ్ ముఖర్జీ ఏ మేరకు అమెరికాను ఒప్పిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
|