మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళినిని ప్రియాంక గాంధీ ఇటీవల కలిశారు. ఈ విషయాన్ని ముద్దాయి తరపు న్యాయవాది వెల్లడించారు. నళిని జీవితంలో శాంతి నెలకొనాలని ప్రియాంక ఈ సందర్భంగా ఆకాంక్షించినట్టు నళిని తరపు న్యాయవాది శ్రీహరన్స్ వెల్లడించారు. నళినితో సమావేశమైన విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్న నగర న్యాయవాది డి.రాజ్ కుమార్ కూడా స్పష్టం చేశారు.
1991 సంవత్సరం మే నెల 21వ తేదీన శ్రీపెంరబుదూరులో జరిగిన జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తన తండ్రిని హతమార్చేందుకు లక్ష్యంగా ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రియాంక ప్రయత్నించినట్టు సమాచారం. వారిద్దరి సమావేశం సందర్భంగా ప్రియాంక, నళినిలు న్యాయపరమైన ప్రశ్నలను సంధించుకున్నట్టు వినికిడి.
ఇదిలావుండగా సాధారణంగా కోర్టులో శిక్ష అనుభవిస్తున్న ఒక ముద్దాయిని ఎవరైనా ఒకరు కలుసుకోవాలంటే ముందుగా కోర్టు అనుమతి తప్పనిసరి. ఆ ప్రకారంగానే ప్రియాంక నళిని కలుసుకున్నట్టు నళిని న్యాయవాది వెల్లడించారు. అయితే నళిని, ప్రియాంకల సమావేశం ఎంతసేపు జరిగింది, వారిమధ్య జరిగిన సంభాషణలు ఏమిటనే విషయాలను కూడా వెల్లడించాలని డి.రాజ్ కుమార్ ఆర్టిఐ కింద ప్రభుత్వాన్ని కోరారు.
|