నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ధరలు తగ్గించే పలు చర్యలను కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ బుధవారం ప్రకటించారు. వంటనూనెను లీటర్కు రూ. 15 సబ్సిడీతో రేషన్ దుకాణాల ద్వారా అందించనున్నామని తెలిపారు.
దీనికి సంబంధించి లోక్సభలో ఆయన ప్రసంగిస్తూ దీనికోసం పది లక్షల టన్నుల వంటనూనెతో పాటు 15లక్షల టన్నుల పప్పుదినుసులను సైతం దిగుమతి చేయనున్నామన్నారు. నిత్యావసర వస్తువులకు సంబంధించి అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతకుముందు ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ స్టీలు, సిమెంటు ధరల పెరుగుదలకు తయారీదారుల కుమ్మక్కు కారణమైనందున వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరిక చేశారు.
అక్రమ నిల్వదారులపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించని కారణంగానే ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. తరచూ తనిఖీలు నిర్వహించి, నిల్వలపై పరిమితి విధించాలని ఆదేశించారు.
అత్యవసర సేవలు, నిర్వహణ చట్టాన్ని (ఎస్మా) సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు. స్వయం సమృద్ధి సాధించేవరకు నిత్యావసర సరకుల దిగుమతి తప్పదన్నారు.
|