యూపీలో మాయావతి పాలన తీరుపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం తన వెంటే ఉన్నారని ఆమె మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలో రెండు లోక్సభ, మూడు విధాన సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు.
ఖలీలాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి భీం శంకర్ అలియాస్ కుశాల్ తివారి 64వేలకు పైగా ఓట్ల తేడాతో సమాజ్వాది పార్టీ అభ్యర్థిపై విజయం సాధించగా, అజంగర్ స్థానం నుంచి అక్బర్ అహ్మద్ దంపి 53వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని చిత్తు చేశారు.
అలాగే బిల్ గ్రామ్ శాసనసభ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 38వేలకు పైగా ఓట్ల తేడాతో, కల్నల్ గంజ్లో బ్రిజ్ సింగ్ సుమారు 9వేల ఓట్లతో ఎస్పీ అభ్యర్థులను ఓడించారు. మొరాద్ నగర్లో రాష్ట్రీయ లోక్దళ్ అభ్యర్థిని ఆ పార్టీ అభ్యర్థి ఓడించారు.
మధ్యప్రదేశ్లోని బెతుల్-హర్దా లోక్సభ స్థానంలో విజయం సాధించడం ద్వారా బీజేపీకి ఊరట లభించగా, కాంగ్రెస్కు మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ మొండి చెయ్యే మిగిలింది.
|