కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి సంపన్న శ్రేణి (క్రిమీలేయర్)ని మినహాయించే విషయంపై యూపీఏ భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో కీలక మిత్ర పక్షమైన డీఎంకే తీవ్ర వ్యతిరేకత తెలుపుతోంది.
ఒబిసి రిజర్వేషన్లను యధాతథంగా అమలు చేయాలని ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కరుణానిధి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. అయితే న్యూఢిల్లీలో మంత్రి ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ ఒబిసి రిజర్వేషన్ల వ్యవహారంలో అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినేట్ కమిటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అయితే యూపీఏ భాగస్వామ్య పార్టీ అయిన పీఎంకే మాత్రం ఒబిసి రిజర్వేషన్ల నుంచి సంపన్న శ్రేణిని మినహాయించాలని కోరింది. ఈ విషయంపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రామదాసు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలసి వినతిపత్రం సమర్పించారు.
|