నందిగ్రామ్లో మళ్లీ ఘర్షణలు జరిగాయి. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు తలెత్తడం ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త వాతావణం నెలకొంది. భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఈ ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీకి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలు గాయపడ్డారు. అనంతరం వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సీపీఎం కార్యకర్తలు నందిగ్రామ్ మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ, లూటీలకు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వీరితో చేతులు కలిపిన ప్రతిరోధ్ కమిటీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై ప్రతిరోధ్ కమిటీ కన్వీనర్ అబూ తాహెర్ మాట్లాడుతూ.. సీపీఎం కార్యకర్తల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు వెళ్లిన తమ కమిటీ కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తోందని వారు ఆరోపించారు.
టాటా కార్ల ఫ్యాక్టరీ కోసం అవసరమైన భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వం సేకరించడానికి వ్యతిరేకంగా నందిగ్రామ్ ప్రజలు ఆందోళన చేయగా, పోలీసులు తుపాకీ గొట్టంతో వారిని అణచివేసిన విషయం తెల్సిందే. ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
|