దేశంలో పేరుకుపోతున్న అవినీతి కేసులను పరిష్కంచేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ విజ్ఞప్తి మేరకు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం శనివారం జరిగింది. కేజీ.బాలకృష్ణన్ నేతృత్వం వహించిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొని కీలకోపన్యాసం చేశారు. దేశంలో అంతకంతకూ పెచ్చుమీరిపోతున్న అవినీతిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కేసులను సత్వరం పరిష్కరించే దిశగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
సుప్రీం క్టోరు ప్రధాన న్యాయమూర్తి అవినీతి తీవ్రతను వివరిస్తూ రాసిన లేఖ తనను ఎంతో ఆలోచింపజేసిందని ప్రధాని అన్నారు. అవినీతి కేసులను సత్వరం పరిష్కరించడానికి సుప్రీం, హైక్టోరులలో న్యాయవాదులు, న్యాయమూర్తుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకు న్యాయ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు ఆయన తెలిపారు.
అంతేకాకుండా.. గ్రామ స్థాయిల్లో కూడా అవినీతి పెరిగి, లక్షలాది కేసులు పెండింగులో ఉండిపోయాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలోనే ఒక వ్యవస్థను రూపకల్పన చేసే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రధాని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి ఉన్న కొన్ని ప్రధాన అడ్డంకులను అధిగమించి కార్యరూపం దాల్చేందుకు కొంత సమయం పడుతుందని మన్మోహన్ అన్నారు.
|