కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచే ఒబిసి రిజర్వేషన్ కోటాను అమలు చేయాల్సిందిగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 27 శాతం రిజర్వేషన్లలో సంపన్నశ్రేణిని మినహాయించి మిగిలిన వారికి వర్తింపజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే కేంద్ర విద్యా సంస్థ (సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్)ల యాక్ట్ పరధిలోకి రాని విద్యా సంస్థలను మినహాయించి మిగిలిన సంస్థల్లో ఒబిసి కోటాతో పాటు.. ఎస్సీలకు ఇచ్చే 15 శాతం, ఎస్టీలకు వర్తించే 7.5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఈసీ నుంచి పరిశోధనా సంస్థలు, జాతీయ, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన విద్యా సంస్థలు, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలను కేంద్రం మినహాయించింది. వీటిలో రిజర్వేషన్ల అమలుపై ఆయా సంస్థల అధిపతులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. అప్పటి వరకు ఈ సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయరు. ఇదిలావుండగా సుప్రీం తీర్పుతో ఐఐఎంలు ఈ ఏడాది అడ్మిషన్లను నిలిపివేశాయి.
అలాగే దేశంలోని అన్ని ఐఐటి విద్యాసంస్థలు వచ్చే మూడేళ్ళలో దశల వారీగా రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు ప్రకటించాయి. ఇకపోతే ఎయిమ్స్, జిప్మర్, రామ్మనోహర్ లోహియా వంటి ఉన్నత వైద్య విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య, వైద్యా శాఖామంత్రి అన్బుమణి రామదాసు ఆదేశాలు జారీ చేశారు.
|