నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధికి 75 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనున్నట్టు కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ తెలిపారు. సోమవారం జరిగిన లోక్సభ సమావేశాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీవ్రవాదం, ఉగ్రవాదాలను అణచివేస్తూ.. దేశ ఆర్థిక, సమాజిక అభివృద్ధి, ప్రాంతీయ అసమానతల తొలగింపునకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
దేశంలో పది రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఇక్కడ నక్సల్స్ కార్యకలాపాలను అణచి వేసేందుకు అవసరమైన సహాయక సహకారాలను రాష్ట్రాలకు అందించడమే కాకుండా అవసరమైన నిధులను కూడా కేంద్రం సమకూర్చుతోందని తెలిపారు. ముఖ్యంగా ఏకే-47, ఎస్ఎల్ఆర్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, మెటల్ డిటెక్టర్స్, హెలికాఫ్టర్లు, ఇతర వాహనాలను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం సమకూర్చుతుందన్నారు.
అలాగే దేశ అంతర్గత భద్రతకు ఏమాత్రం విఘాతం కలుగకుండా కేంద్ర రాష్ట్రల సంబంధాలు మెరుగు పరుచుకుంటూ, సరిహద్దు భద్రతను పటిష్టం చేసినట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సంబంధాల మెరుగు కోసం కమిటీ సిఫార్సు చేసిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అక్రమ చొరబాటుదార్లను అరికట్టేందుకు పూర్తి అధికారాలను రాష్ట్రాలకు అప్పగించినట్టు పేర్కొన్నారు.
|