పాకిస్థాన్లోని వివిధ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నట్టు కేంద్రం మంగళవారం వెల్లడించింది. లోక్సభ సమావేశాల్లో భాగంగా సభ్యులు సుఖ్దేవ్ సింగ్ థిండ్సా, ఎం.రాజ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీప్రకాష్ జైశ్వాల్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్న జాబితా ప్రకారం పాక్ జైళ్లలో 436 మంది జాలర్లు, మరో 53 మంది సాధారణ ఖైదీలు ఉన్నట్టు మంత్రి వివరించారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భారత్-పాకిస్థాన్ న్యాయవ్యవస్థ కమిటీ ఖైదీల సంఖ్యను నిర్ధారించిందని చెప్పారు. అలాగే భారత్ కూడా పాకిస్థాన్కు ఒక జాబితాను అందజేసిందని, అందులో 133 మంది ఇతర ఖైదీలు, 14 మంది జాలర్లు మన దేశ జైళ్ళలో ఉన్నట్టు వివరించారు. ఈ ఖైదీలు ఎపుడు విడుదల చేస్తారన్న విషయంపై ఖచ్చితమైన సమయం ఏదీ నిర్ణయించలేదని మంత్రి పేర్కొన్నారు.
|