దేశంలో పెరిగిపోతున్న ధరలకు కళ్లెం వేసేందుకు దేశ పారిశ్రామికరంగం తమ వంతు సహకారం అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధరల పెరుగుదల ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఈ ప్రభావం మన దేశంపైనా పడిందన్నారు. అయినప్పటికీ ధరలను అదుపు చేయడం ప్రభుత్వ బాధ్యతగా ఆయన చెప్పుకొచ్చారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, ధరలను నియంత్రిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే ధరల నియంత్రణలో పరిశ్రమలదే కీలక పాత్ర అని మన్మోహన్ చెప్పుకొచ్చారు. తాము ఉత్పత్తి చేసే వస్తువులను పన్ను మినహాయింపుతో విక్రయించి, వినియోగదారునికి వీలైనంత తక్కువ ధరలకు విక్రయించేందుకు పారిశ్రామికవేత్తలు చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం మాత్రమే అరికట్టలేదని, ఉత్పత్తిదారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆయన నొక్కివక్కాణించారు.
|