కేంద్ర మంత్రి టీఆర్.బాలు వ్యవహారంలో తన కార్యాలయం అసాధారణంగా వ్యవహిరించలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో మిగిలిన వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవ్రా పార్లమెంటుకు వివరించారని తెలిపారు.
ఇదిలావుండగా. మంత్రి బాలు కుటుంబానికి చెందిన కంపెనీలకు సాయం చేయాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని మంత్రి దేవ్రా స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం రాజ్యసభలో నాలుగు పేజీల ప్రకటన చదివి వినిపించారు. గత ఎన్డీయే ప్రభుత్వం తమ కంపెనీకి చెందిన కేటాయింపులను రద్దు చేయడంపై 2005 మే నెలలో కింగ్స్ ఇండియా ఛైర్మన్ టి.ఆర్.బి.బజా నుంచి ప్రధానికి ఒక లేఖ వచ్చిందన్నారు.
ఇందులో తన కంపెనీకి జరిగిన నష్టాన్ని ఏకరవు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం పొందలేక పోవడంతో హైకోర్టును ఆశ్రయించిందన్నారు. అలాగే కేంద్ర మంత్రి బాలు తనను కలసి, తన కుటుంబానికి చెందిన కంపెనీకి, కార్మికులకు జరిగిన నష్టాన్ని వివరించారని దేవ్రా చెప్పారు.
|