ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై యూపీఏ, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతాయని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ కానున్నట్టు ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. అణు ఒప్పందంపై లెఫ్ట్ పార్టీలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను నివృత్తి చేసేందుకు గాను యూపీఏ-లెఫ్ట్ సమన్వయ కమిటీ ఏర్పాటైన విషయం తెల్సిందే. ఈ కమిటీ ఎన్నోమార్లు సమావేశమైనప్పటికీ.. అణు ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాలేక పోతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం కమిటీ నేతలు మరోసారి భేటీ అయ్యారు. ఇందులో భారతకు ప్రాధాన్యమిచ్చే సురక్షిత రక్షణ ఒప్పందంపై రెండు గంటల పాటు నేతలు కూలంకుషంగా చర్చలు జరిపారు. అయినప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేక పోయారు. ఈ సమావేశం అనంతరం ప్రణబ్ ముఖర్జీ వామపక్ష నేతలు మరికొన్ని సందేహాలను వ్యక్తం చేశారని, వీటిని కొద్ది రోజుల్లో నివృత్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ అవుతామని ముఖర్జీ చెప్పారు.
|