పోటీ రాజకీయాల కారణంగా దేశాన్ని అగ్రస్థానానికి చేర్చే దార్శనికతను నేతలు పక్కనబెడుతున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. దీర్ఘ కాలిక ప్రణాళికలను రూపొందించలేని రాజకీయ వ్యవస్థ మన దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఐఏఎస్ ప్రోబేషనర్ల మధ్య ఆయన బుధవారం సాయంత్రం ప్రసంగిస్తూ కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుండటం, ప్రతి నిత్యం ఎక్కడో ఓ రాష్ట్రంలో లేక నియోజక వర్గాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతుండటంతో నేతల దృష్టి ఎల్లవేళలా దానిపైనే ఉంటోందన్నారు.
అంతమాత్రాన రాజకీయాలు ప్రాముఖ్యం లేనివని తాను చెప్పడం లేదన్నారు. పలు విధాలుగా రాజకీయ నేతలు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారని చెప్పారు. అయినా దీర్ఘ కాలిక వ్యూహంతోనే దేశం పురోగతి దిశగా పయనించగలదని అభిప్రాయపడ్డారు.
|