ఒరిస్సా రాష్ట్రంలోని వీలర్ ఐలాండ్ నుంచి బుధవారం విజయంవతంగా ప్రయోగించిన అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి భారత రక్షణ దళాలకు లభించిన మరో అధునాతన అస్త్రం. దక్షిణ చైనా సముద్రతీరంలోని సాన్యా ద్వీపం వద్ద చైనా ఖండాంతర క్షిపణులను మొహరించి వుందన్న వార్తలు వెలువడిని కొద్ది రోజులకే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించండం ప్రత్యర్థి దేశం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అగ్ని-3 సైన్యం వినియోగానికి సిద్ధంగా ఉందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు విజయగర్వంతో ప్రకటించారు. అంతేకాకుండా డీఆర్డీవో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభవేళలో భారత జాతికి అందించిన కానుక అగ్ని-3 అని ప్రాజెక్టు డైరక్టర్ అవినాశ్ ఛాండ్లర్ ప్రకటించారు. ఈ ప్రయోగంతో ఖండాతర క్షిపణలు కలిగిఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.
మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అగ్ని-3 క్షిపణి సులభంగా ఛేదించగలదు. ఈ అస్త్రంతో చైనా రాజధాని బీంజిగ్, షాంఘై నగరాలను గురిపెట్టగల శక్తిని దేశ రక్షణ దళాలు సొంతం చేసుకున్నాయి. ఉపరితలం నుంచి ఉపరితంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-3 ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన అగ్ని-1, అగ్ని-2ల కంటే చాలా భిన్నమైంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత నేవిగేషన్ వ్యవస్థను ఇందులో తొలిసారి అమర్చారు. అగ్ని-3 క్షిపణి విజయంతో అగ్ని-4 ఖండాంతర క్షిపణి తయారీకి మార్గం సులభమైందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
|