కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిమ్స్ సవరణ చట్టం ద్వారా డైరక్టర్ పదవి నుంచి డాక్టర్ వేణుగోపాల్ను తొలగించడం చెల్లదని భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణం ఆయన్ను డైరక్టర్ పదవిలో నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్న 'తెలుగు తేజం' వేణుగోపాల్ రెడ్డికి సుప్రీం తీర్పుతో నైతిక విజయం లభించింది.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరక్టర్గాను, ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతిగా ఉన్న డాక్టర్ వేణుగోపాల్ రెడ్డికి, కేంద్ర మంత్రి అన్బుమణికి లోగడ మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఎయిమ్స్ డైరక్టర్ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా మంత్రి హుకుం జారీ చేశారు. దీనికి వేణు గోపాల్ ససేమిరా అన్నారు. దీంతో మంత్రి ప్రత్యేక చొరవ చూపించి ఎయిమ్స్ సమవరణ చట్టాన్ని తెచ్చి, డైరక్టర్గా విధులు నిర్వహించేందుకు గరిష్ట వయోపరిమితిని 65 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ సవరణ చట్టాన్ని గత 2007 సంవత్సరం ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేశారు. దీంతో వేణుగోపాల్ తన డైరక్టర్ పదవికి రాజీనామా చేసి, కార్డియాలజీ విభాగ అధిపతిగా కొనసాగుతూ, మంత్రిపై న్యాయ పోరాటం సాగించారు. వేణుగోపాల్ తరపున అడ్వకేట్ మానేంద్ర సింగ్ కోర్టులో హాజరై వాదించారు. పిటీషనర్ వాదోపవాదాలను విన్న అపెక్స్ కోర్టు.. మంత్రి చర్యను తప్పుపట్టింది. ఎయిమ్స్ వంటి స్వయం ప్రతిపత్తి సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదని అపెక్స్ కోర్టు హితవుపలికింది.
అంతేకాకుండా ఎయిమ్స్ డైరక్టర్ పదవికి 65 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్ణయించడం, ఎయిమ్స్ సవరణ చట్టాన్ని రూపొందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. వేణు గోపాల్ను బలవంతంగా పదవి నుంచి తప్పించాలనే ఉద్దేశంతో సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు వేణుగోపాల్తో సహా ఆయనకు మద్దతు ఇస్తున్న సహచర వైద్యులకు ఎంతో ఊరటనిచ్చింది. కేంద్ర మంత్రి అన్బుమణి రామదాస్కు చెంప పెట్టులాంటిదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|