కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి అర్జున్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి స్వయంగా సొంత పార్టీపైనే. పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నానాటికీ సన్నగిల్లుతోందన్నారు.
ముఖ్యంగా ఒక అంశంపై నిర్ణయాలు తీసుకోవడం పడిపోతోందన్నారు. గతంలో ఒక అంశంపై నిర్ణయం తీసుకునే ముందు పలు అంశాలను పరిగణంలోకి తీసుకోవడం, వాటిపై సంప్రదింపులు జరిపి, తుది నిర్ణయం తీసుకునేవారన్నారు.
ప్రస్తుతం ఈ పద్దతి క్రమేపీ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జర్నలిస్టు కన్హాయాలాల్ నందన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన మనస్సులోని మాటను వెల్లడించారు. అర్జున్ సింగ్పై వివిధ ఆర్టికల్స్తో కూడిన ఒక పుస్తకాన్ని నందన్ రచించారు.
ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. దేశంలోనే ఒక నాయకుడిగానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడిగా ఎవరికి స్థానం ఇస్తారన్న ప్రశ్నకు అర్జున్ సింగ్ సమాధానం ఇస్తూ మహాత్మాగాంధీకి పేరును ప్రస్తావించారు.
అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్ధార్ పటేల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, కామరాజర్లను కూడా ఆ జాబితాలో పేర్కొంటానని చెప్పారు. అయితే ఇందిరా గాంధీకి మాత్రం ప్రత్యేక శైలి ఉందన్నారు. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందని అర్జున్ సింగ్ అభిప్రాయపడ్డారు.
|