కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోందని కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గానే స్పందించింది. మంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఏఐసీసి ప్రతినిధి షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు.
ఒక సమస్యపై అన్ని కోణాల్లో ఆలోచించి, నిజాయితీగా, పారదర్శకంగా తుది నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన వివరణ ఇచ్చారు. కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన విషయాలే కాకుండా ఇతర సమస్యలపై మిత్రపక్షాలతో కూడా కూలంకుషంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
అర్జున్ సింగ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించం. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎల్లపుడూ నిజాయితీగా, పారదర్శకంగా అందరితో సంప్రదింపులు జరుపుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ సంప్రదింపులు అనేవి అన్ని దశల నేతలతో జరుపుతున్నారు. ఆ తర్వాతే తుది నిర్ణయానికి వస్తున్నట్టు షకీల్ వివరించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అర్జున్ సింగ్ కూడా ఒక సభ్యుడని, ఈ సమావేశంలో ఎవరైనా, ఎలాంటి అంశంపైనైనా నిర్భయంగా చర్చించవచ్చని తెలిపారు. ఆది నుంచి పాటిస్తున్న సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ అందరితో సంప్రదింపులు జరుపుతోందని షకీల్ తెలిపారు.
|