పంచాయతీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వామపక్ష కార్యకర్తల వైఖరిపై కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా నందిగ్రామ్లో సీపీఎం కార్యకర్తలు గుండాలుగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 18వ తేదీన నందిగ్రామ్ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం ఓడిపోతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
దీంతో ఆ పార్టీ కార్యకర్తలు నందిగ్రామ్లో చొరబడి కాంగ్రెస్ సానుభూతిపరుల గుర్తింపు కార్డులను దౌర్జన్యంగా లాక్కెళ్లినట్టు ఫిర్యాదులు తమకు అందాయని చెప్పారు. నందిగ్రామ్లోని లెఫ్ట్ ప్రభుత్వ ప్రోత్సాహంతో సీపీఎం కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మున్షీ ఆరోపించారు.
నందిగ్రామ్ గ్రామ ప్రజలపై వారికివున్న అక్కసు ఇంకా తీరలేదని అందువల్లే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలోని వామపక్ష కూటమికి ఆ రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని మున్షీ జోస్యం చెప్పారు.
|