జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని సాంబా జిల్లాలో మిలిటెంట్లు ఒక్కసారి తెగబడ్డారు. భద్రతా బలగాల కన్నుగప్పి సాంబా జిల్లాలోకి ప్రవేశించిన మిలిటెంట్లు ఒక ఇంటిలో తిష్టవేసి, నివాసి ప్రాంతాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫోటో జర్నలిస్టు, ఒక జవానుతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒక మిలిటెంట్ను కూడా భద్రతా బలగాలు హతమార్చాయి.
గత రెండు రోజులుగా సరిహద్దు రేఖలో పాక్కు చెందిన మిలిటెంట్లు భారత భూభాగంలోని చొరబడేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం భద్రతా బలగాలపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. అలాగే ఆదివారం ఉదయం నివాసిత ప్రాంతాలపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. కైలిమండి సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇండియన్ డెమొక్రటిక్ పార్టీ నేత హోషైర్ సింగ్, ఆయన భారయ రేఖా అంప్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని జమ్మూలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిలిటెంట్ల వద్ద అధునాతన టెలిస్కోపిక్ ఆయుధాలు, ఆర్మీ కంబోట్ డ్రస్, బ్యాగులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. నివాసిత ప్రాంతాలపై దాడులు మిలిటెంట్లు దాడులు జరుపుతున్న విషయాన్ని తెలుసుకున్న భద్రతా బలగాలు రంగప్రవేశం చేసి భీకర కాల్పులు నిర్వహించాయి. అయితే మిలిటెంట్లు కొంతమంది ప్రజలను కిడ్నాప్ చేశారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రవాదులు తిష్టవేసిన ఇంటిలో కనీసం ఇద్దరు పిల్లలతో నలుగురు ఉన్నారు.
|