జైపూర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్టు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా ప్రకటించారు. బాంబు పేలుళ్ళ జరిగిన తర్వాత ఆమె హుటాహుటిన సంఘటనా ప్రాంతలాకు చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్షతగాత్రులను, బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ బాంబు పేలుళ్ళ సంఘటనపై గురువారం నాటికి నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఆమె చెప్పారు. బాంబు పేలుళ్ళపై మాకు ముందస్తు సమాచారం లేదని కూడా తెలిపారు.
ఈ దాడులు దేశ మంతటా జరుగుతున్నాయని, ఇలాంటి పిరికి చర్యలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదిలావుండగా పేలుళ్ళ అనంతరం శాంతి భద్రతలను పరీక్షించే విషయంపై ఆమె బుధవారం కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జరిగిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
|