జైపూర్ బాంబు పేలుళ్ళ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో వీరు గాయపడి అక్కడే ఉన్నారు. దీంతో వీరిని సందేహించి అదుపులోకి తీసుకొన్నారు. మంగళవారం రాత్రి జైపూర్లో ఏడు వరుస బాంబు పేలుళ్ళు జరిగిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళ వెనుక బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హర్కత్ అల్ జహీద్ ఇస్లామియా (హుజి) అనే తీవ్రవాద సంస్థ హస్తమున్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు.
అంతేకాకుండా పేలుళ్ళు జరిగిన ప్రాంతాల్లో జరిపిన ప్రాథమిక విచారణలో బాంబుల తయారీలో పేలుడు పదార్థంగా అమ్మోనియం నైట్రేట్, కొత్త సైకిళ్లు, సైకిల్ బాల్ బేరింగ్స్, ఇనుప ముక్కలను వాడినట్టు వెల్లడైంది. దీనిపై రాజస్థాన్ హాం శాఖామంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ.. పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 63కు చేరుకుందని చెప్పారు.
మరో 122 మంది గాయపడినట్టు చెప్పారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులలో చేర్చినట్టు వివరించారు. ఇదిలావుండగా అనధికారిక లెక్కల ప్రకారం బాంబు పేలుళ్ళ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 85పైగా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అదనపు బలగాలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.
|