కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపారు. ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. రెండో దశలో మొత్తం 66 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో భాజపాకు 32-42 సీట్లలో గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 15-20, జేడీఎస్కు 8-12 సీట్లు చొప్పున వస్తాయని ఆ సర్వే పేర్కొంది.
కిందటి ఎన్నికలతో పోల్చితే భారతీయ జనతా పార్టీ మూడు శాతం ఓట్లను మెరుగు పరుచుకోగా, కాంగ్రెస్ పార్టీ ఒక శాతం, జేడీఎస్ రెండు శాతం మేరకు ఓట్లను కోల్పోయిందని వెల్లడించింది. మిగిలిన పార్టీలు 2-4 సీట్లలో గెలుపొంద వచ్చని సర్వే తేల్చింది. ఈనెల పదో తేదీన జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్లోనూ భాజపాకే మెగ్గు కనిపించిన విషయం తెల్సిందే.
ఇప్పటి వరకు జరిగిన 155 సీట్ల (మొత్తం సీట్లు 224)కు గాను భారతీయ జనతా పార్టీ 73 సీట్లలోను, కాంగ్రెస్ (45), జేడీఎస్ (42)లు 87 సీట్లను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సర్వే తెలిపింది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 29వ తేదీన 69 స్థానాలకు జరుగనుంది. కాగా, రెండో దశ పోలింగ్లో మాజీ ముఖ్యమంత్రులు యడ్డియూరప్ప, ఎస్.బంగారప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ.ప్రకాష్లు ఉన్నారు.
|