వచ్చే ఆగస్టు 31వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా లోక్సభ ఎన్నికలు జరుగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి ప్రకటించారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పునర్విభజన నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా వచ్చే ఆగస్టు 31వ తేదీ నాటికి సిద్ధమవుతుందని చెప్పారు.
ఇటీవల ముగిసిన కర్ణాటక విధాన సభ ఎన్నికలు కూడా పునర్విభజన నియోజకవర్గాల ప్రకారమే జరిగాయని గోపాలస్వామి గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న పునర్విభజన కమిటీ ఛైర్మన్ జస్టీస్ కులదీప్ సింగ్ మాట్లాడుతూ అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మినహా దేశ వ్యాప్తంగా పునర్విభజన పనులు జోరుగా సాగుతున్నట్టు చెప్పారు.
కేంద్రంలోని యూపీఏ సర్కారు నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ప్రధాని మిత్రపక్ష నేతలకు విందు ఇచ్చారు. ఈ విందు ఇచ్చిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి దేశ రాజధానిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వచ్చే లోక్సభ ఎన్నికలు ఆగస్టు 31వ తేదీ తర్వాత ఏక్షణంలోనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం.
|