అమర్నాథ్ యాత్ర సోమవారం నుంచి ప్రారంభమైంది. వాతారణం అనుకూలించక పోవడంతో యాత్రను తాత్కాలికంగా ఒక రోజు పాటు నిలిపి వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గట్టి పోలీసు భద్రత నడుమ యాత్రను మళ్లీ ప్రారంభించారు. భగ్వాతి నగర్ బేస్ క్యాంపు నుంచి బయలుదేరిన భక్తుల బృందంలో మొత్తం 3531 మంది భక్తులు ఉన్నారు. వీరిలో 619 మంది మహిళలు, 70 మంది చిన్నారులు ఉన్నారు.
భగ్వాతి నగర్ బేస్ క్యాంపు నుంచి దక్షిణ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర గుహవైపు బయలుదేరారు. భక్తులతో బయలుదేరిన వాహనాలకు సీఆర్పీఎఫ్ జవాన్లు గట్టి భద్రతను కల్పిస్తున్నారు. అమర్నాథ్ యాత్రా మార్గంలో భారీ వర్షాలు, అననుకూల వాతావరణం కారణంగా యాత్రను ఆదివారం నిలిపి వేసిన విషయం తెల్సిందే.
ఈనెల 17వ తేదీన ప్రారంభమైన ఈ యాత్రలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30,593 మంది భక్తులు నిమగ్నమైవున్నారు. హిందువులు చేపట్టే తీర్థయాత్రల్లో అమర్నాథ్ యాత్రను అతి పుణ్యమైనదిగా భావిస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జమ్మూకాశ్మీర్ లోయలకు తరలి వస్తుంటారు.
|