భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం వ్యవహారంలో పార్లమెంటులో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 'వాతావరణ మార్పులపై జాతీయ విధాన ప్రణాళిక' విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మన్మోహన్ సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడారు.
అణు ఒప్పందంపై తమను తోసిరాజని ముందుకు వెళితే మద్దతు ఉపసంహరిస్తామని వామపక్షాలు పదేపదే చేస్తున్న ఊదరదంపుడు హెచ్చరికలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఒప్పందంపై అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. అణు ఒప్పందం అమలు విషయంలో దేనినైనా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా అణు ఒప్పందంపై నెలకొన్న సందేహాలు, అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఐఏఈఏతో సహా ఎఎస్జీలతో కుదుర్చుకునే ఒప్పందానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అణు ఒప్పంద ప్రక్రియను అందరి సహకారంతో ముందుకు తీసుకెళతామని, ఈ ఒప్పందాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి సభ ఆమోదాన్ని పొందుతామని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
|