కేంద్రంలో అణు ఒప్పందం కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు యూపీఏ మిత్రపక్ష నేతలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. నంబరు పది, జనపథ్లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది. సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి లాలూ నిరాకరించారు.
ఇదిలావుండగా, ఎస్పీ సీనియర్ నేత అమర్ సింగ్ కూడా సీపీఎం పార్టీకి చెందిన ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ వైఖరిని వివరించడమే కాకుండా.. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కారంపై చర్చించినట్టు సమాచారం. వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడగలికే శక్తి ఎస్పీకి మాత్రమే ఉంది.
ఈ పార్టీకి 39 మంది ఎంపీలు ఉండటంతో విశ్వాసపరీక్షలో కీలక పాత్ర పోషించనుంది. ప్రధాని మన్మోహన్ సోమవారం చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెల్సిందే. అణు ఒప్పందంపై పార్లమెంట్లో తేల్చుకుంటామని ప్రకటించడమే కాకుండా.. ఐఏఈఏ, ఎన్ఎస్జితో చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చేందుకు ప్రధాని సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
|