లోక్సభలో 39 మంది ఎంపీలు కలిగిన సమాజ్వాదీ పార్టీ చక్రం తిప్పనుంది. అణు ఒప్పందం కారణంగా యూపీఏకు లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో యూపీఏ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకోనుంది. ఈ విషయం ఎస్పీ నేతల వ్యవహార ధోరణిని చూస్తుంటేనే తేటతెల్లమవుతోంది.
ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై చర్చలు జరిపారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇందులో తమకు రాజకీయ శత్రువులు లేరని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఎస్పీ నేతలు కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సంకేతాలుగా భావిస్తున్నారు.
అంతేకాకుండా ఎస్పీ సీనియర్ నేతలతో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణ్ బుధవారం సమావేశమై, అణు ఒప్పందం ప్రయోజనాలను వివరిస్తారని యాదవ్ చెప్పారు. వచ్చే గురువారం యూఎన్పీఏ నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ములాయం సింగ్ తన పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అంతేకాకుండా తమ పార్టీకి రాజకీయ శత్రువులు లేరని వ్యాఖ్యానించడం కూడా ఆయన భావజాలంలో కనిపించిన స్పష్టమైన మార్పుగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తమ పార్టీ నేతలతో నారాయణ్ సమావేశమై వివరిస్తారన్నారు. అణు ఒప్పందం కారణంగా సంక్షోభం తలెత్తిన పక్షంలో తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామని యాదవ్ తెలిపారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో అధికారం కోల్పోయిన ములాయం సింగ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, మాయావతి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. యూపీ ప్రభుత్వం ఎస్పీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. ప్రభుత్వ చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు కేంద్రంతో చేతులు కలపాలని ఎస్పీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.
|