కేంద్రంలోని యూపీఏతో తెగతెంపులు చేసుకునేందుకు వామపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ముహుర్తాన్ని కూడా ఖరారు చేశాయి. జపాన్లో జరుగనున్న జి-8 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ఈనెల ఆరో తేదీన బయలుదేరి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగిన మరుక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లెఫ్ట్ పార్టీలు మద్దతు విరమించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వాన్ని రక్షించేందుకు మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. అదేసమయంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ బుధవారం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన నేతలకు అణు ఒప్పంద ప్రయోజనాలను వివరించనున్నారు.
దీంతో అందరి కళ్లు ప్రస్తుతం ఎస్పీపై కేంద్రీకృతమైవున్నాయి. లెఫ్ట్ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్న పక్షంలో యూపీఏ ప్రభుత్వ మనుగడ ములాయం సింగ్ కరుణకటాక్షాలపై ఆధాపడనుంది. ఇదిలావుండగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ), న్యూక్లియర్ సప్లయర్ గ్రూపు (ఎన్ఎస్జి)తో మిగిలిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని వియన్నాకు పంపనుంది.
ఇదే జరిగిన మరుక్షణమే మద్దతు ఉపసంహించుకోవాలనే కృతనిశ్చయంలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు మరో వాదన వినిపిస్తోంది. మొత్తంమీద మద్దతు ఉపసంహరణ ముహుర్తాన్ని ఐదు లేదా ఆరు తేదీగా నిర్ణయించినట్టు లెఫ్ట్ వర్గాలు యూఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.
|