ఐక్య జాతీయ ప్రగతిశీల కూటమి (యూఎన్పీఏ) నేతల కీలక సమావేశం గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కూటమి నేతల సమావేశం, ఎస్పీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత అమర్ సింగ్ నివాసంలో జరుగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ములాయం సింగ్ అధ్యక్షత వహిస్తారు.
ఇందులో కూటమి నేతలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఓం ప్రకాష్ చౌతలా, బృందావన్ గోస్వామి, మరాండీ తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 'మీకోసం' యాత్రలో ఉన్న చంద్రబాబు గురువారం ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇందులో అణు ఒప్పందం, ద్రవ్యోల్బణం, శాంతిభద్రతలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, దేశ ఆర్థిక స్థితిగతులు, పెట్రో ఉత్పత్తుల కొరత తదితర అంశాలపై ప్రధానంగా చర్చలు జరుపనున్నారు.
ముఖ్యంగా అణు ఒప్పందం వ్యవహారంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రధాన్యత సంతరించుకుంది. మద్దతు ఇచ్చే అంశంపై ఎస్పీ అధినేత ములాయం సింగ్, అమర్ సింగ్లు ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపిన విషయం తెల్సిందే. మరోవైపు యూపీఏకు ఎస్పీ మద్దతు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలను చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు.
|