పౌర అణు ఒప్పందంతో దేశ అణు సార్వభౌమత్వానికి కీడు రాదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. భారత-అమెరికా అణు ఒప్పందంపై జాతికి వివరణ ఇవ్వాలని సమాజ్వాది పార్టీ నేత అమర్ సింగ్ బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరిన నేపధ్యంలో సమాజ్వాది పార్టీ, వామపక్షాల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసింది. బుధవారం సాయంత్ర సమాజ్వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్తో భేటీ అయిన ఎస్పీ నేత అమర్ సింగ్ ఈ ఒప్పందంపై తమ కున్న కీలకమైన సందేహాలను ప్రస్తావించారు. అమెరికా ఒప్పందం కారణంగా భారత అణు, విదేశీ విధానాలకు సంబంధించిన స్వతంత్ర వైఖరి దెబ్బతినే ప్రమాదముందా అని అమర్సింగ్ గుచ్చి గుచ్చి అడిగారు.
సమాజ్వాది పార్టీ నేతల సందేహాలను నివృత్తి చేయడానికి తక్షణమే ప్రతిస్పందించిన ప్రధాని కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాల్లో విధాన నిర్ణయాలకు సంబంధించి కొనసాగుతున్న స్వయంప్రతిపత్తికి ఈ అణుఒప్పందంతో ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేసింది. భారత వ్యూహాత్మక కార్యకలాపాలను ఈ ఒప్పందం ఏ మాత్రం అడ్డుకోలేదని పేర్కొంది.
ఇదేసమయంలో ప్రతిపక్ష బిజెపి సందేహాలకు కూడా పిఎంఒ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. అణు పరీక్షలను కొనసాగించడానికి భారత్కు ఉన్న హక్కును అణు ఒప్పందం భంగపర్చలేదని చెప్పింది. అలాగే ఇరాన్తో భారత్కు ఉన్న సంబంధాలను ఈ ఒప్పందం దెబ్బతీయనుందా అని అమర్సింగ్ అడిగిన ప్రశ్నకు, అంతర్జాతీయ ద్వైపాక్షిక సంబంధాలను భారత్ సమయానుగుణంగా గౌరవిస్తుందని, దీనిపై ఏ బాహ్య ప్రభావాలు పనిచేయవని ప్రధాని కార్యాలయం తేల్చి చెప్పింది.
|