మావోయిస్టుల వరుస దాడులు తీవ్రతరమైన నేపథ్యంలో వీరితో తలపడేందుకోసం ఆరు తీవ్రవాద వ్యతిరేక అటవీ యుద్ధతంత్ర పాఠశాలలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీవ్రవాద వ్యతిరేక శిక్షణా సామర్థ్యాన్ని పెంచే నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం వంతుగా ఈ సంవత్సరం 6 తీవ్రవాద వ్యతిరేక అటవీ యుద్ధతంత్ర శిక్షణా పాఠశాలలను ఈ సంవత్సరం ఏర్పర్చాలని నిర్ణయించినట్లుగా గుప్తా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు తీవ్రవాదంపై ఇటీవలే కొత్త విధానం చేపట్టింది. నక్సల్ ప్రాభావిత ప్రాంతాలన్నిటినీ సమన్వయిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక సంస్కరణలతో పాటు పోలీసులు సామర్థ్యాన్ని పెంచే విధానాన్ని కేంద్రం ప్రకటించింది. మావోయిస్టుల వ్యాప్తికి కారణమైన సామాజిక, ఆర్థిక అంశాలపై ముప్పేట దాడులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
బలిమెల రిజర్వాయర్లోని లాంచీపై దాడిచేసి 38మంది పోలీసులను చంపి 18 రోజులు కాకముందే ఒరిస్సాలోని మల్గన్గిరి జిల్లాలో మావోయిస్టులు తిరిగి పంజా విసరటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
|