లోక్సభ సభాపతి సోమనాథ్ ఛటర్జీ నిర్ణయం సీపీఎం పార్టీని తీవ్ర నిరాశకు లోను చేసింది. సభాపతి స్థానం నుంచి తక్షణం తప్పుకోవాలని ఆ పార్టీ అగ్రనేతలు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. వీటిని సభాపతి పెడచెవిన పెట్టారు. స్పీకర్ పదవి రాజకీయాలకతీతమైనదని, ఆ పదవిని రాజకీయం చేయవద్దని ఆయన హితవు పలికారు. అప్పటికీ ఒత్తిడి చేస్తే మాత్రం ఎంపీ పదవితో సహా, స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని సోమనాథ్ హెచ్చరించారు. దీంతో ఖంగుతిన్న సీపీఎం కేంద్ర కమిటీ తుది నిర్ణయాన్ని సభాపతి విజ్ఞతకే వదిలివేసింది.
ఈ నేపథ్యంలో సీపీఎం మంగళవారం మరో విజ్ఞప్తి చేసింది. విశ్వాస పరీక్షా సమయంలో స్పీకర్ ఓటు నిర్ణయాత్మకంగా మారిన పక్షంలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. అంతకుముందు.. స్పీకర్ రాజీనామాకు తిరస్కరించడంతో ఆయనపై క్రమశిక్షణా చర్య చేపట్టేందుకు సీపీఎం కేంద్ర కమిటీ సంకేతాలు పంపింది.
వాటిని ఏమాత్రం ఖరారు చేయని 79 సంవత్సరాల కమ్యూనిస్టువృద్ధనేత.. ఎప్పటిలా తన విధులకు హాజరయ్యారు. ఆయన సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు అఖిలపక్ష పార్టీలకు చెందిన ఏ ఒక్క నేత కూడా అభ్యంతరం వ్యక్తం చేయక పోవడం గమనార్హం.
వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి స్పీకర్పై ఒత్తిడి పెరిగిన విషయం తెల్సిందే. అయితే యూపీఏ విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత సోమనాథ్ తన పదవితో సహా, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
|