యువ ఎంపీ, ఏఐసీసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మంగళవారం జరిగిన యూపీఏ విశ్వాస పరీక్షలో కీలకోపన్యాసం చేశారు. భారతావనిలోని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజల దుర్భర జీవన స్థితిగతులను సభ ముందు ఉంచారు. ఇందుకోసం ఆయన ఇటీవల నిర్వహించిన విదర్భ పర్యటనలో ఎదురైన అనుభవాలను తన ప్రసంగపాఠానికి కీలంకంగా చేసుకున్నారు.
విశ్వాస పరీక్ష చర్చలో తన వంతు వచ్చినపుడు.. భారతీయ జనతా పార్టీ మొదలు అన్ని పార్టీలనూ ఆయన ప్రస్తావిస్తూ అందరూ దేశం గురించే ఆలోచిస్తున్నారని భావిస్తున్నాంటూ రాహుల్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే రాహుల్ ప్రసంగానికి బీఎస్పీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. విదర్భ పర్యటనలో కళావతి అనే ఒక మహిళ దుర్భర పరిస్థితులు చూసి తాను చలించిపోయానని సభాదృష్టికి తీసుకొచ్చారు.
దేశంలో ఆత్మహత్య చేసుకున్న ఒక కుటుంబం గురించి చెబుతున్నప్పుడు మనం ఆ కుటుంబాల పట్ల సానుభూతి చూపడమే కాకుండా వారిని గౌరవించాలని కోరారు. అలాగే కళావతి అనే మహిళ దుస్థితిని వివరించారు. ఈమె భర్త ఒక రైతు అని, తొమ్మిది మంది పిల్లలు కలిగిన కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.
|