యూపీఏ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే ఓటింగ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠతలో ఉన్నారు. స్పీకర్ స్థానంలో సభాపతి సోమనాథ్ ఛటర్జీ లేరు. తాత్కాలిక స్పీకర్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సభ పోడియం వద్దకు డబ్బు కట్టలతో కూడిన బ్యాగుతో వచ్చారు. బ్యాగులోని నోట్ల కట్టలను స్పీకర్కు చూపించారు.
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతలు భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులకు ఈ నోట్ల కట్టలను ఇవ్వజూపారని భాజపా సభ్యులు ఆరోపించారు. ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్వయంగా ఈ కట్టలను ఇచ్చేందుకు పూనుకున్నారని వారు ఆరోపించారు. ఈ సంఘటన పార్లమెంట్ను ఒక్కసారి కుదిపేసింది. విశ్వాస పరీక్షపై చర్చ తాత్కాలికంగా వాయిదా పడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంట్ ప్రాంగణంలోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే విషయం నిగ్గు తేలాల్సి వుంది.
|