భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలకు లంచం ఇవ్వజూపారని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. ఒక్కో ఎంపీకి మూడు కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంపై జరుగుతున్న విశ్వాస పరీక్ష సమయంలో భాజపా ఎంపీలు నోట్ల కట్టలతో కూడిన బ్యాగులను స్పీకర్ పోడియం వద్దకు తీసుకొచ్చి సభలో చూపించారు. ఈ నగదును పార్టీలకు అమెరికా డాలర్ల రూపంలో ఇవ్వజూపారని భాజపా ఆరోపించింది.
తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలకు లంచాన్ని భారీ మొత్తంలో ఆఫర్ చేశారని చెప్పారు. ఈ ముగ్గురు ఎంపీలలో మహావీర్ బంగోరా, అశోక్ అర్గాల్, ఫగ్గన్ సింగ్ కులస్తేలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ చర్య నిర్ఘాంత పోయేలా చేసిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చారు. భాజపా నిరాధారమైన ఆరోపణలను చేస్తోందని లాలూ అభిప్రాయపడ్డారు.
|