హర్యానాలోని సిర్సా జిల్లాలో జరిగిన ఘటనను నిరసిస్తూ పంజాబ్లో దమ్ దామీ తక్సల్ (భింద్రన్వాలా) సిక్కు కార్యకర్తలు వాహనాల రాకపోకలను బుధవారం అడ్డుకున్నారు. దమ్దామీ తక్సల్ అధినేత హర్నాం సింగ్ ధూమా పిలుపుమేరకు సిక్కులు ఈ నిరసనకు దిగారు.
అమృత్సర్ జిల్లా వాలా గ్రామం వద్ద సంత్ సమాజ్ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీనితో అమృత్సర్-జలంధర్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీనితో సహార్సా గరీభ్ రథ్ ఎక్స్ప్రెస్, అమృత్సర్-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్, హరిద్వార్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్, నాందేడ్ సచ్ఖండ్ ఎక్స్ప్రెస్, అమృత్సర్-న్యూఢిల్లీ సూపర్ ఎక్స్ప్రెస్లు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ఈ రైళ్లన్నీ అమృత్సర్ విడిచి ముందుకు సాగగానే కార్యకర్తలు నిలిపివేయడం గమనార్హం.
రాష్ట్రంలోని ఫతేఘర్, ఫగ్వారా, మోగా జిల్లాల్లో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను కార్యకర్తలు అడ్డుకున్నారు. దేరా సచ్చా సౌదా అధినేత బాబా రామ్ రహీం సింగ్ను అరెస్టు చేయాలంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. సిక్కులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన రాం రహీంను ఉరితీయాలని దమ్ దామీ తక్సల్ (భింద్రన్వాలా) కార్యకర్త అమ్రిక్ సింగ్ డిమాండ్ చేశారు. సిక్కు పవిత్ర క్షేత్రమైన అమృత్సర్తో పాటుగా ఇతర చోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు.
|