లంచం ఇవ్వజూపారని ఆరోపణలు చేసిన ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎంపీలపై సమాజ్వాది పార్టీ సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ దిశగా ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ఈ విషయాన్ని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆ పార్టీ ఎంపీ మోహన్ సింగ్ బుధవారం వివరించారు.
లోక్సభలో జరిగిన యూపీఏ విశ్వాస పరీక్షలో ఓటింగ్ సమయాన సభకు గైర్హాజరు అయ్యేందుకు వీలుగా ఎస్పీ నేతలు లంచం ఇవ్వజూపారని భాజపా ఎంపీలు ఆరోపించిన విషయం తెల్సిందే. ఓటింగ్కు గంట ముందు లాబీలోకి వెళ్లిన వీరు తిరిగి సభలోకి నోట్ల కట్టలతో కూడిన బ్యాగులతో ప్రవేశించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
ఎస్పీకి చెందిన అగ్రనేతలు తమకు తొమ్మిది కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వజూపారని ముగ్గురు భాజపాకు చెందిన అశోక్ సింగ్ అర్ఘాల్, పాఘాన్ సింగ్ కులస్తే, మహావీర్ భగోడాలు ఆరోపించారు. ఓటింగ్ సమయంలో సభకు గైర్హాజరు కావాలని ఎస్పీ నేతలు తమను కోరినట్టు వారు ఆరోపించారు.
ఎస్పీకి చెందిన కొందరు అగ్రనేతలు నగదు ఎర చూపారని ప్రకటించారు. దీనిపై ఎస్పీ అధిష్టానం మండిపడింది. నిరాధారమైన ఆరోపణలు చేసి, తమను అవమాన పరిచినందుకు గాను ముగ్గురు ఎంపీలపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పార్టీ యోచిస్తోందని ఎంపీ మోహన్ సింగ్ తెలిపారు.
|