భారత-శ్రీలంక మధ్య రామ సేతు లేదని సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. సేతు పనులను కేంద్రం కొనసాగించుకోవచ్చునని సుప్రీం పచ్చజెండా ఊపింది. సేతు సముద్రం కాల్వ పనుల్లో భాగంగా ఎటువంటి వారధులను కూలగొట్టకూడదని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో రామ సేతు వంటి వంతెన అక్కడలేదని వివరించింది. కంబ రామాయణం ప్రకారం రామ సేతువు శ్రీరాముడే కూలగొట్టారని తెలిపింది. తూర్పు, పశ్చిమ కోస్తాల మధ్య నౌకల రాకపోకలను వేగిరం చేసేందుకు సేతు కాల్వ పనులను చేపడుతున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
పశ్చిమ దిశ నుంచి భారత దేశ తూర్పు కోస్తాలోని నౌకాశ్రయాలకు నౌకలు చేరుకునేందుకు ప్రస్తుతం శ్రీలంకను చుట్టివస్తున్నాయని వివరించింది. సేతు కాల్వ అమలు ద్వారా నౌకల రాకపోకల్లో సమయం ఆదా అవటమే కాకుండా ఇంధనం మిగులుతుందని పేర్కొంది. సేతు కాల్వ ద్వారా 424 నాటికల్ మైళ్ల ప్రయాణం నౌకలకు ఆదా అవుతుందని తెలిపింది.
సేతు కాల్వ పనులను కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) 2004 జులైలో ప్రారంభించింది. సేతు సముద్రం పథకం అమలుకోసం రామ సేతువు కూలగొట్టకూడదని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనితో కేసు సుప్రీం చెంతకు చేరింది. ప్రస్తుతం సుప్రీం ఉత్తర్వుతో తమిళనాడులో ప్రభుత్వాన్ని నడుపుతున్న డీఎంకే ఈ పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పూర్తిచేయటానికి కృషిచేస్తుంది.
|