యూపీఏకు అనుకూలంగా ఓటువేసి సీపీఎం నుంచి బహిష్కరించబడిన స్పీకర్ సోమనాథ్ చటర్జీ పార్టీలో కొనసాగాలనుకుంటే సెంట్రల్ కంట్రోల్ కమిషన్కు అప్పీలు చేసుకోవచ్చునని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. రాష్ట్ర సీపీఎం కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... అణుఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎంపీలకు డబ్బుల పంపిణీకి సంబంధించిన టేపులను కేంద్రం బహిర్గత పరచాలని కారత్ డిమాండ్ చేశారు. అణుఒప్పందం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తానని కారత్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తుకుదుర్చుకునే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, గత రెండేళ్లుగా బాబుతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు కారత్ వెల్లడించారు. సీపీఎం విప్ను ధిక్కరించి, యూపీఏకు అనుకూలంగా ఓటువేసిన కారణంగా సీపీఎం సోమనాథ్ చటర్జీని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
|