తను స్థాపించిన గ్లోబల్ పీస్ మిషన్ను రద్దు చేసినందుకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాలకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిందని ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు పాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని కొలంబియా కోర్టు దాఖలు చేసిన సమన్ల ప్రతులను మీడియాకు విడుదల చేశారు.
న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ గ్లోబల్ పీస్ మిషన్ రద్దులో భారత నేతల పాత్రతో పాటు అమెరికా నేతల పాత్ర కూడా ఉందని తాను వేసిన పిటిషన్పై కొలంబియా కోర్టు స్పందించిందని అందుకు ప్రతిగా ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సహా కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీలకు కూడా సమన్లు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొలంబియా కోర్టు జారీ చేసిన సమన్ల ప్రతులను మీడియాకు ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మత ప్రచారకుడుగా, ప్రజాశాంతి పార్టీ స్థాపకుడుగా పేరున్న కె.ఎ. పాల్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లు రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీ నేతలు, ప్రభుత్వ ప్రతినిధులపై మాత్రమే ధ్వజమెత్తుతూ మీడియా దృష్టిని ఆకర్షించే పాల్ ప్రస్తుతం ఏకంగా ఢిల్లీ నేతలకు, అమెరికా నేతలకు సమన్లు జారీ అయ్యేలా చేశానని చెప్పడం గమనార్హం.
|