అమర్నాథ్ భూవివాదం కాశ్మీర్లో రోజు రోజుకు విజృంభిస్తోంది. కర్ఫ్యూలు, ఆంక్షలు విధించి ఆందోళన కారులను అడ్డుకున్నప్పటికీ ఆందోళనలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ భూవివాదంపై ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు ఆందోళన నిర్వహించాలని భాజపా కోర్ కమిటీ నిర్ణయించింది. అమర్నాథ్ దేవస్థానానికి చెందిన భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్దరించే వరకు తాము ఆందోళన పంథాను అనుసరిస్తామని భాజపా స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, అమర్నాథ్ సమస్యను పరిష్కరించేందుకుగానూ జమ్మూ- కాశ్మీర్ గవర్నర్ వొహ్రా నలుగురితో కూడిన ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో జేకే ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎస్.ఎస్.బ్లోరియా, జమ్మూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అమితాద్ మాట్టో, జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ జీడి.శర్మ, అమర్నాథ్ ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిబి.వ్యాస్లు ఉన్నారు.
మరోవైపు అమర్నాథ్ సమస్య పరిష్కారానికి ప్రధాని మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలతో ఆయన బుధవారం అఖిలపక్ష సమావేశంలో... జమ్మూ-కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించడమే కాకుండా సమస్యకు స్వస్తి పలికే మార్గాలపై చర్చలు జరిపారు.
|