ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ.. సమాజ్వాదీ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందని అందువల్లే మహిళా రిజర్వేషన్ బిల్లును అటకెక్కించారని భారతీ జనతా పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. ఈ బిల్లుకు ఇక మోక్షం కలిగే మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందక పోవచ్చని ఆమె అన్నారు. విశ్వాస తీర్మానానికి ముందు సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలకు మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మరుగున పడే ప్రమాదముందని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఆమోదానికి సమాజ్వాదీ పార్టీ అడ్డంకిగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా బిల్లు ఆమోదం పొందకుండా ఉండేలా ఎస్పీ నేతలు కాంగ్రెస్కు షరతులు విధించారని ఆమె పేర్కొన్నారు. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం మేరకు ఈ బిల్లును అమల్లోకి తెస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. బిల్లును ఎగువసభలోనే ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం హిందువుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. దీనికి సాక్ష్యమే అమర్నాథ్ ఆలయ భూమి కేటాయింపు వ్యవహారమని సుష్మాస్వరాజ్ అన్నారు.
|