ఆగస్టు 16న రాఖీ పండుగను పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మహిళల కోసం ఓ విన్నూత్న పథకాన్ని సిద్ధం చేసింది. రాఖీ పండగ దినాన రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
ఈ విషయమై హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా గురువారం ఓ ప్రకటన చేశారు. దీని ప్రకారం రానున్న శనివారం రోజు హర్యానాలోని మహిళలు దూర ప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా మహిళలు తమతో పాటు 15 ఏళ్ల లోపు వయసు కల్గిన తమ పిల్లల్ని సైతం ఉచితంగానే వెంట తీసుకుని వెళ్లోచ్చు.
అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్డినరీ బస్సులకు మాత్రమే వర్తించనున్నట్టు ముఖ్యమంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డీలక్స్, ఏసీ, వాల్వో లాంటి బస్సుల్లో ఈ సౌకర్యం లభించదని ఈ ప్రకటనలో హర్యానా ప్రభుత్వం తెలిపింది.
|