యావద్భారతదేశం నేడు ఘనంగా 62వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ సంబరాల్లో భాగంగా భారతావనికి స్వేచ్ఛను తెచ్చేందుకు ఆనాడు తమ జీవితాలనే అంకితం చేసిన మహనీయులను స్మరణ చేసుకుని పులకించి పోయింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్రకోటపై వరుసగా ఐదో మారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జాతినుద్ధేశించి మాట్లాడుతూ... ధీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరం కలిసి కట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. లౌకిక రాజ్యమైన మన భారతదేశంలో అమరనాథ్ భూవివాదం కారణంగా మతం పేరుతో జరుగుతున్న హింసాకాండపై ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను రాజకీయంగా కాకుండా... దేశ శ్రేయస్సు పరంగా ఆలోచించి శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని ప్రధాని వ్యాఖ్యానించారు. మతం పేరున ప్రజల్లో అసమానతలను కలిగించి తద్వారా వివాదాలకు రాజకీయాలు మూలం కాకూడదని... దీని కారణంగా దేశ స్వేచ్ఛకు, సమైక్యతకు, సమగ్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరించారు. కనుక దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందరం కలిసి ముందుకు నడుద్దామని కోరారు.
|