దేశంలో మతం పేరుతో రాజకీయాలు సాగిస్తూ.. దేశ ప్రజలను విభజించడం దేశ సమగ్రతకు అత్యంత ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 62వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని చారిత్రాత్మక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని శుక్రవారం ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ.. మతోన్మాదం వల్లే కాశ్మీర్లో కల్లోలం నెలకొందని అన్నారు. ఈ కల్లోల పరిస్థితిని ఎదుర్కొనడానికి అందరూ సమిష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తరిమి కొడుతున్నామని చెప్పుకొచ్చారు. యుపిఏ హయాంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందంజ వేసిందని మన్మోహన్ వివరించారు.
రూ.25 వేల కోట్లతో వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ పారిశ్రామిక ప్రగతితో సమతుల్యత సాధిస్తున్నామని చెప్పారు. ఈ సారి విద్యా రంగానికి పెద్ద పీట వేశామని చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పెరుగుదలే దేశం ముందున్న ప్రధాన సమస్యగా పేర్కొన్న ప్రధాని, దీనికి పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు.
దేశానికి స్వాతంత్ర్య తెచ్చిన త్యాగధనులను, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నా సైనికుల సేవలను మరువరాదన్నారు. ప్రాథమికోన్నత స్థాయి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. దేశాభివృద్ధిలో విద్యుత్ పాత్ర కీలకమని, అందువల్లే అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు.
|