బీహార్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు లఖసరాయ్ జిల్లాలోని రామ్ఘర్ చౌక్ పోలీసు స్టేషన్ పరధిలోని ఝులౌనా గ్రామంలో పెద్ద గొయ్యిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
జమాయ్ జిల్లాలోని శిఖంద్రా అనే ప్రాంతం నుంచి లఖిసరాయ్ జిల్లాకు కొంతమంది ప్రయాణికులతో వస్తున్న బస్సు ప్రమాదానికి లోనైనట్టు పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ అదుపు కోల్పోవడమే ప్రమాదానికి కారణమని వారు చెప్పారు. ప్రమాద స్థలంలోనే ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించారు. వీరిలో శంకర్ యాదవ్, సంజయ్ సావో, కైలాష్ మండల్, సదన్ మండల్, కలో మండల్, చందన్లు ఉన్నారు. ఒక మహిళతో సహా మరో రెండు మృతదేహాలను గుర్తించాల్సి వుందని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలానికి జిల్లా పోలీసులతో సహా, జిల్లా యంత్రాంగం హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
|