వచ్చే ఏడాదిలో జరుగనున్న లోక్సభ సాధారణ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కదలికలు ఊపందుకుంటున్నాయి. ఇందులోభాగంగా.. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించడమేకాకుండా.. ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఆ కోవలోనే కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. యూపీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రధాని మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సూచనప్రాయంగా వెల్లడించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధాని మన్మోహన్సింగ్తో కలిసి సోనియా విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కూడా ఎర్రకోటపై మన్మోహనే జాతీయజెండా ఎగురవేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించారు.
దీనిపై సోనియా సమాధానం ఇస్తూ.. ఎందుకు కాదు. తప్పకుండా. అంటూ సమాధానమిచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని అధికారపూర్వకంగా వెల్లడిస్తామని ఆమె ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పోటీకి దింపుతారనే ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే. వీటిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఖండించిన విషయం తెల్సిందే.
|